Nagula Panchami Celebrations : కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ డివిజన్లో నాగుల పంచమి వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి శ్రీవల్లి దేవసేన శ్రీ నాగేంద్ర స్వామి ఆలయంలో నాగుల పంచమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు ఉదయాన్నే తలంటు స్నానం చేసి, పసుపు, కుంకుమ, పూలతో శ్రీ నాగేంద్ర స్వామిని పూజించారు. స్వామివారికి పుట్టలో పాలు పోసి, నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సందడితో ఆలయ ఆవరణలో పండగ వాతావరణం నెలకొంది. చిన్నారులు, భక్తులతో ఆలయమంతా కిటకిటలాడింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అన్ని సౌకర్యాలను కల్పించారు. శ్రావణ మాసంలో నాగుల పంచమి రావడంతో స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ పండుగ సందర్భంగా మహిళలు తమ కుటుంబ శ్రేయస్సు కోసం పాలు, ప్రసాదం సమర్పించడానికి సమీపంలో ఉన్న శివుని దేవాలయాలకు, పుట్టలకు పోటెత్తారు.
Comments