MLA Parthasarathi Horse Riding : కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వినూత్నంగా ప్రజాసమస్యలు పరిష్కరిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇవాళ మైనారిటీ కాలనీలో నిర్వహించిన 'ప్రజల కోసం మీ ఎమ్మెల్యే పార్థసారథి' కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మరోసారి తన వినూత్న శైలితో ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నారు. వృత్తిరీత్యా దంత వైద్యుడైన ఆయన, నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవడానికి సరికొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే కాలనీలో పర్యటించిన ఆయన, ఒక జట్కా బండి నిర్వాహకుడిని కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్వయంగా గుర్రంపై స్వారీ చేస్తూ స్థానికులకు అభివాదం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గత వారంలో మేక పాలు పితకడం, గాడిద పాలు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రజలకు వివరించటం వంటి పనులతో ఆయన తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇలా రోజుకో రకమైన వినూత్న ప్రజా పర్యటనలతో సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే పార్థసారథి చేసిన గుర్రపు స్వారీ వీడియోతో మరోసారి నెట్టింట హాట్ టాపిక్గా మారారు.
Comments