Varuna yagam concluded at Indrakeeladri : రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఇంద్రకీలాద్రిపై గత మూడు రోజులుగా జరుగుతున్న 'వరుణ యాగాలు' మహా పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఆదేశాల మేరకు ఆలయ ఈవో శీనా నాయక్ పర్యవేక్షణలో వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు ఈ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముగింపు వేడుకల సందర్భంగా ఉదయం దుర్గాఘాట్ వద్ద కృష్ణానదీ జలాలను అర్చకులు, వేదపాఠశాల విద్యార్థులు ఘటాల్లోకి సేకరించారు. అనంతరం పవిత్ర జలాలతో కూడిన ఘటాలను శిరస్సుపై దాల్చి, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ ఇంద్రకీలాద్రిపైకి ఊరేగింపుగా తీసుకొచ్చారు. సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు చేసిన ఈ ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉదయం 7 గంటలకు శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో మహాన్యాస పారాయణం, ఘటాభిషేకం, హోమాలు నిర్వహించారు. అనంతరం పాత యాగశాల వద్ద వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య 'మహా పూర్ణాహుతి' కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు.
Comments