Collector Village In Adilabad : పట్టిపీడిస్తున్నపేదరికం సహా సరైన నివాసం లేక ఇబ్బందులు పడుతున్న మారుమూల కొలాం గిరిజనుల జీవితాల్లో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సరికొత్త వెలుగులు నింపారు. నివాసం లేని నిరుపేదలకు ఇళ్ల పట్టాలతో పాటు 'ఇందిరమ్మ గృహాలు' మంజూరు చేశారు. వారి సొంతింటి కలను నిజం చేయడంతో గిరిజనులు ఆ పాలనాధికారికి నీరాజనాలు పట్టారు. తమ బతుకుల్లో వెలుగులు నింపి, సొంతింటి కలను తీర్చి, జీవితాల్లో మంచి మార్పును తెచ్చిన అధికారిపై ప్రత్యేక అభిమానాన్ని చాటారు. దహిగూడ కొలాంగూడేనికి 'రాజర్షిషా గూడ' అని నామకరణం చేసుకొని కృతజ్ఞత చాటుకున్నారు. ఈ రాజర్షిషాగూడలో కలెక్టర్ గురువారం పర్యటించారు. గ్రామంలో నిర్మాణం పూర్తైన 3 ఇందిరమ్మ గృహాల్లో లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించారు. గతంలో 17 మంది పేద గిరిజనులకు ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించారు. కలెక్టర్ చొరవతో మౌలిక వసతులు వేగవంతమయ్యాయని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. కలెక్టర్ చొరవ వల్లే తమ సొంతింటి కల నెరవేరిందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Comments