Drone Catches Gamblers in Kadapa : కడప జిల్లా వేంపల్లి మండలంలో పోలీసులు డ్రోన్ కెమెరాలతో గట్టి నిఘా పెట్టారు. ఈ డ్రోన్ కెమెరా కంటికి ఐదుగురు జూదరులు అడ్డంగా దొరికిపోయారు. వేంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కత్తులూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కత్తులూరు గ్రామంలోని చీని చెట్ల కింద పట్టాలు పరిచి జూదం ఆడుతున్నారు. వేంపల్లి సీఐ నరసింహులు ఆధ్వర్యంలో పోలీసులు ఆ ప్రాంతంలో డ్రోన్ తో నిఘా పెట్టారు. ఈ డ్రోన్ ద్వారా తీసిన దృశ్యాల్లో జూదరులు స్పష్టంగా కనిపించారు. చీని చెట్ల కింద పేకాట ఆడుతున్న దృశ్యాలను పోలీసులు డ్రోన్ ద్వారా చూశారు. వెంటనే పోలీసులు ఆ ప్రాంతంపై ఆకస్మిక దాడి చేశారు. అక్కడికక్కడే ఐదుగురు జూదరులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారి నుంచి రూ.8,990 నగదును సీజ్ చేశారు. అలాగే వారు ఆడుతున్న పేక ముక్కలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ నరసింహులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
Comments