Sabitham Waterfalls : పెద్దపల్లి జిల్లాలోని సబితం గ్రామంలోని గౌరీ గుండాల జలపాతం జలకళను సంతరించుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో యేరులో ప్రవాహ ఉద్ధృతి పెరిగింది. గత కొన్ని రోజులుగా కొండలపై నుంచి దూకుతున్న ఈ జలపాతం ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ జల సౌందర్యాన్ని వీక్షించేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పర్యటకులు అధికంగా తరలి వస్తున్నారు. ఆకుపచ్చటి తివాచీ పరిచినట్లు ఉండే కొండలు, అందులోంచి జాలువారుతున్న జలపాతంలో తడిసి ముద్దవుతూ పర్యటకులు సందడి చేస్తున్నారు. జలపాతం సమీపంలోనే పుట్టినరోజు వేడుకలు కూడా నిర్వహించుకుంటూ సెల్ఫీలు దిగుతూ ఆనందంగా గడుపుతున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం 14 ఏళ్ల కిందట వెలుగులోకి రాగా ఇప్పుడిప్పుడే అభివృద్ధికి నోచుకుంటోంది. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఇటీవల ప్రభుత్వం రూ.20 కోట్లు విడుదల చేయగా, పనులు మాత్రం నెమ్మదిగా నడుస్తున్నాయి.
Comments