హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో విషసర్పాల సంచారం కలకలం రేపాయి. పాములతో పాటు వీధికుక్కల సంచారం కూడా ఎక్కువగా ఉండటంతో పోలీసు సిబ్బంది, ఫిర్యాదుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఫిర్యాదుదారులు వేచి ఉన్న ప్రాంతంలోకి మూడు నాగుపాముల పిల్లలు రావడంతో అక్కడ ఒక్కసారిగా ఆందోళన వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసు సిబ్బంది వెంటనే వాటిని ప్లాస్టిక్ బకెట్లో బంధించారు. అనంతరం ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీకి సమాచారం అందించగా, సంస్థ సభ్యుడు థామస్ అక్కడికి చేరుకుని మూడు విషసర్పాలను సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు తీసుకెళ్లారు.
Comments