Council Chairman Objects to Minister Atchanna Comments: కల్తీ నెయ్యి అంశంపై శాసన మండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల తీరుపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన శ్రీవారి ప్రసాదం లడ్డూ విషయంలో వైఎస్సార్సీపీ సభ్యుల తీరు బాధ కలిగిస్తోందని మండిపడ్డారు. సభలో తాను మంత్రిగా కాకుండా ఒక సామాన్య శ్రీవారి భక్తునిగా మాట్లాడుతున్నానని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇతర మతాలను గౌరవించాలని స్పష్టం చేశారు. తాను హిందువునని జగన్, ఛైర్మన్ మోషేన్ రాజు క్రిస్టియన్లు అని కానీ అది తప్పుకాదు ఎవరు ఏ మతం అయినా అనుసరించవచ్చని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. తనను క్రిస్టియన్ అనడంపై ఛైర్మన్ మోషేన్ రాజు అభ్యంతరం తెలిపారు. నా కులం, మతంపై మాట్లాడటం మీకు తగదని తాను హిందువునని మోషేన్ రాజు ప్రకటించారు. ఛైర్మన్ ప్రకటనతో తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్లు మంత్రి అచ్చెన్న తెలిపారు. అయినప్పటికీ వైఎస్సార్సీపీ సభ్యుల గొడవ కొనసాగించారు. మంత్రి క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. మంత్రి వ్యాఖ్యలకు తాను సంతృప్తి చెందానన్న మోషేన్ రాజు ఇంకా మీకు అభ్యంతరం ఏంటని వైఎస్సార్సీపీ సభ్యులను ప్రశ్నించారు. దీంతో మండలి 5 నిమిషాలపాటు వాయిదా పడింది.